మనటీవీలో ఐఐటీ, నీట్, ఎంసెట్ శిక్షణ
ఈనాడు, హైదరాబాద్:
ఇటీవల గ్రూప్-2 పరీక్షల శిక్షణకు వచ్చిన అనూహ్య స్పందన దృష్ట్యా ఐఐటీ, నీట్,
ఎంసెట్లకు కూడా మనటీవీ(సాఫ్ట్నెట్) ద్వారా శిక్షణివ్వాలని తెలంగాణ ఐటీశాఖ
నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 2 నుంచి మనటీవీ-1, మనటీవీ-2 ఛానళ్లలో
ప్రత్యక్ష ప్రసారం ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఆరంభించబోతోంది. సాఫ్ట్నెట్
వెబ్సైట్ను ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్యతో కలసి ఐటీశాఖ మంత్రి
కేటీఆర్ బుధవారం ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సాంకేతికతను వాడుకొని పేదప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు
నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని
చేపట్టామని అన్నారు. మనటీవీ ద్వారా గ్రూప్-2 శిక్షణిస్తే... వాటిని సుమారు
30లక్షల మంది యూట్యూబ్ ద్వారా చూడగా, 20వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నారు.
ఆ స్ఫూర్తితోనే నీట్, ఐఐటీ, ఎంసెట్లకు ఉపయోగపడే పాఠాలు తయారు
చేశామని, చుక్కారామయ్య మార్గదర్శనంలో సాగుతున్న ఈ కార్యక్రమం
విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటులో అందిస్తున్న
శిక్షణను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ అందిస్తే వారూ ఎందులోనూ తీసిపోరని
అన్నారు. సాంకేతికత తెలిసిన వారు మంత్రులైతే కలిగే ప్రయోజనాలు
మంత్రి కేటీఆర్ను చూస్తే అర్థమవుతున్నాయని చుక్కా రామయ్య అన్నారు.
ప్రపంచ మార్కెట్ను అందుకోవాలంటే సాంకేతికత ఆధారంగా విద్యాబోధన
జరగాలని, ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన ప్రశంసించారు.
జనవరి 2
నుంచి రోజూ 6 గంటలు తరగతులు
ఈ శిక్షణ కార్యక్రమంలో
భాగంగా సుమారు 540 గంటల పాఠ్యాంశాలను తయారు చేశారు. మనటీవీ(సాఫ్ట్నెట్)లో
జనవరి రెండో తేదీ నుంచి మేలో ఎంసెట్ పూర్తయ్యేదాకా ప్రసారం చేస్తారు.
రోజూ ఉదయం 6 నుంచి 9 గంటలవరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ
ఉంటుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన ఐదు సబ్జెక్టులకు చెందిన 52 మంది
నిపుణులతో డిజిటల్ బోర్డులు, దృశ్యాత్మక ప్రదర్శన(పవర్ పాయింట్ ప్రజెంటేన్)ల
సాయంతో ఈ పాఠాలు బోధిస్తారు. ఇతర పరీక్షలను దృష్టిలో ఉంచుకొని జనవరిలో
30 రోజులు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 15 రోజులు, ఏప్రిల్లో 20 రోజుల పాటు పాఠాలను
ప్రసారం చేస్తామని మనటీవీ సీఈవో శైలేశ్రెడ్డి తెలిపారు. మనటీవీ-1లో
ప్రతిరోజూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయ్యే పాఠ్యాంశాలను మరుసటి రోజు మనటీవీ-2లో
పునఃప్రసారం చేస్తామన్నారు. ఈ పాఠాలనే సాఫ్ట్నెట్లో భాగమైన
మనటీవీ యూట్యూబ్, ఫేస్బుక్ల్లో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రతి విద్యార్థీ మనటీవీ శిక్షణ కార్యక్రమాలను
వీక్షించవచ్చని శైలేశ్ చెప్పారు.